సగం గడ్డం గీశాక డబ్బులు అడిగిన క్షురకుడు.. షేవింగ్ పూర్తయ్యాక ఇస్తాననడంతో గొడవ.. ఇద్దరి హత్య

ఓ సెలూన్‌లో డబ్బుల కోసం మొదలైన చిన్నపాటి గొడవ రెండు హత్యలకు దారితీసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని బోధి గ్రామంలో గురువారం రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్ సురేశ్ దేవ్‌కర్ అనే 22 ఏళ్ల యువకుడు షేవింగ్ కోసం అనిల్ మారుతి షిండే సెలూన్‌‌కు వచ్చాడు. సగం షేవింగ్ అయ్యాక వెంకట్‌ను అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తయ్యాక ఇస్తానని వెంకట్ బదులిచ్చాడు. 

దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది మరింత ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్ దుకాణంలోని పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు గోశాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన అతడి బంధువులు సెలూన్ వద్దకు చేరుకుని దానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత పరారీలో ఉన్న అనిల్‌ను వెతికి పట్టుకుని కొట్టి చంపారు. అతడి ఇంటిని కూడా తగలబెట్టారు. ఈ ఘటనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Madhya Pradesh
Nanded
Salon
Shaving
Barber

More Telugu News